తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలు మెుదలవుతుండగా.. 11 తర్వాత బయట తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఇక వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే ములుగు, ఖమ్మం, కొమరంభీం, మెదక్ జిల్లాల్లో నలుగురు వ్యక్తులు వడదెబ్బ సోకి మృతి చెందారు.
ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన బడుగుల పిచ్చయ్య (63) కూలి పనికి వెళ్లినప్పుడు వడదెబ్బ తగిలి మరణించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పొలంపల్లి నాగయ్య గుంపునకు చెందిన పొడుగు శేషగిరి (35) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందారు. కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతు మానేపల్లి గొంతయ్య (19) పొలంలో పనిచేస్తుండగా వడదెబ్బ తగిలి మరణించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతంపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య(49) కూలి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదం అలముకుంది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకండి.
శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. పలుచని, తేలికపాటి, కాటన్ దుస్తులు ధరించాలి.
బయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ లేదా తలపాగా తప్పకుండా ఉపయోగించాలి.
శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి రోజంతా తరచుగా నీరు త్రాగాలి.
డీహైడ్రేషన్కు గురిచేసే టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి.
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
ఎండలో శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాల్సి వస్తే, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు త్వరగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa