ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇంటి కోసం,,,మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబం ఎదురు చూపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:42 PM

నేటి కాలంలో వార్డు మెంబర్‌గా చేసే వారు సైతం భారీగా వెనకేసుకుంటున్నారు. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, ఇలా వారి స్థాయిలను బట్టి.. వెనకుసుకునేవారి సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. వారి సంపాదన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సైతం.. తరాలబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తిని వెనకేసుకునే వారు ఉన్నారు. మరి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఎంత సంపాదన వెనకేసుకుని ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 4సార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు. కానీ అతడి కుటుంబ సభ్యులు మాత్రం కడు పేదరికంలో ఉన్నారు. ప్రస్తుతం వారు ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారంటే.. ఆ ఎమ్మెల్యే ఎంత నిజాయితీపరుడో అర్థం చేసుకోవచ్చు.


వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సూర్యపేటకు చెందిన ఉప్పల మల్సూర్. కానీ ఆయనకు కనీసం సొంతిల్లు కూడా లేదు. పైగా ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని సైతం ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే.. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఇంటిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది.


గతంలో మల్సూర్.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. విలువలకు కట్టుబడి జీవించారు. అక్రమ సంపాదన కాదు కదా.. ఆయన జీతం డబ్బులను కూడా ప్రజా సేవకే వినియోగించారు. ప్రభుత్వం నుంచి ఆయన పొందింది ఏం లేదు. పైగా తనకున్న ఆస్తిని కూడా ప్రజల కోసమే దానం చేశారు. దీంతో ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు దీన స్థితిలో జీవనం వెళ్లదీస్తున్నారు. వారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కూడా సగం కూలిపోతే, మిగిలిన దాని పైన మీద టార్పాలిన్‌ కవరు కప్పి… ఆ కొద్ది జాగాలోనే తలదాచుకుంటున్నారు.


ఎన్నికల ప్రచారం వేళ తమ ఇంటికి వచ్చిన నేతలు.. అధికారంలోకి రాగానే.. తమకు ఇల్లు ఇస్తామని, సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ నాయకులు, అధికారులు ఎవ్వరూ కూడా తమను పట్టించుకోవడం లేదని మల్సూర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మల్సూర్ కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. ఈ వార్త తెలిసిన జనాలు.. నిజమైన ప్రజా సేవకులు అంటే వీళ్లు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంటున్నారు. మరి నేతలు, అధికారులు వీరి అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa