రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్సిటీలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా భూగర్భంలోనే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్సిటీలో ఎలాంటి విద్యుత్ తీగలు, టవర్లు, స్తంభాలు పైకి కనిపించకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భ విద్యుత్ లైన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయంలో విద్యుత్ శాఖ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. డేటా సెంటర్లకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో విద్యుత్ లైన్ల ఆధునికీకరణ, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్యూచర్సిటీ నిర్మాణం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని, అందులో భాగంగానే భూగర్భ విద్యుత్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ప్రయోగాత్మకంగా స్మార్ట్పోల్స్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని, ఇది గత ఏడాది కంటే 9.8 శాతం అధికమని తెలిపారు. 2025-26 నాటికి ఇది 18,138 మెగావాట్లకు, 2034-35 నాటికి ఏకంగా 31,808 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని, నూతన విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.అంతేకాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇది పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa