పిల్లలందరికీ చదువుకునే హక్కుంది.. వారికి నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశాయి. పిల్లలకు మంచి విద్యను అందించడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉపాధ్యాయులను నియమిస్తుంటాయి. మరి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ.. పిల్లలకు మెరుగైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు కాస్త.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.తాజాగా ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిగా స్కూల్కి రాకుండా.. పూర్తి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలుపై.. ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన నల్లగొండ జిల్లా, చందంపేట మండలం, గాగిళ్లాపురంలో వెలుగు చూసింది. ఇక్కడ ఉన్న మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పర్వీన్ సుల్తానాపై విద్యా శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె చేసిన పని తెలిసి ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఏడాది నుంచి విధులకు హాజరు కాకుండానే.. పూర్తి జీతం తీసుకుంటుంది. అసలేం జరిగిందంటే..
ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన పర్వీనా సుల్తానా ప్రారంభంలో కొర్రతండా ప్రాథమిక పాఠశాలలో పని చేసేది. అయితే అక్కడ విద్యార్థులు లేక పోవడంతో.. ప్రభుత్వం గతేడాది జులైలో.. పర్వీన్ సుల్తానాని డిప్యూటేషన్ మీద గాగిళ్లాపురం పాఠశాలకు మార్చింది. అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి ఆమె విధులకు సరిగా హాజరు కావడంలేదు. అంతేకాక అప్పడప్పుడూ స్కూల్కి వచ్చి.. హాజరుపట్టికలో సంతకాలు పెట్టి వెళ్తుండేది. ఇందుకు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇలా ఏడాది పాటుగా సుల్తానా స్కూల్కి వెళ్లకుండా.. పూర్తి జీతం తీసుకుంటుంది.
ఈ వ్యవహారంలో స్కూల్ హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవో సామ్యా నాయక్ కూడా పాలు పంచుకున్నారు. సుల్తానా తనకు వచ్చిన జీతంలో సగ భాగాన్ని హెచ్ఎం వేణు మాధవ్, సామ్యా నాయక్లకి ఇచ్చేది. దాంతో వారు ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఏడాది పాటు వీరు ఇలా దర్జగా ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాలు వీరి వ్యవహారం గురించి డీఈవో భిక్షపతికి ఫిర్యాదు చేశాయి. కానీ ముందు ఆయన కూడా దీన్ని లైట్ తీసుకున్నాడు.
దాంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న డీఈఓ దిగి వచ్చి.. ఉపాధ్యాయ సంఘ నేతలతో రాజీకొచ్చాడు. వారి డిమాండ్ మేరకు సదరు ఉపాధ్యాయురాలు పర్వీనా సుల్తానాతో పాటుగా ఆమెకు సహకరించిన హెడ్ మాస్టర్ వేణు మాధవ్, ఇన్ఛార్జ్ మాజీ ఎంఈవోగా ఉన్న సామ్యా నాయక్ను కూడా విద్యా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పుడీ విషయం స్థానికంగా సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa