ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టులకు ఎదురుదెబ్బ , అగ్ర నాయకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 11:40 AM

మావోయిస్టు పార్టీకి మరో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ సుధాకర్‌, భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతమైన నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో మావోయిస్టు సీనియర్‌ నాయకులు సమావేశమయ్యారన్న కచ్చితమైన సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) దళాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో, గురువారం తెల్లవారుజామున మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సుధాకర్‌ మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుధాకర్‌... మావోయిస్టు వర్గాల్లో గౌతమ్‌, ఆనంద్‌, చంటి బాలకృష్ణ, రామరాజు, సోమన్న వంటి అనేక మారుపేర్లతో సుపరిచితుడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామం. గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న సుధాకర్‌పై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో కూడా ఆయన పాల్గొన్నారు.బీజాపుర్‌ ఎస్పీ డాక్టర్‌ జితేంద్ర యాదవ్‌ ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనను ధృవీకరించారు. అయితే, సుధాకర్‌ మృతికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa