ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణాలో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 06:22 PM

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తహశీల్దార్ సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆర్. సంతోష్ కుమార్ పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్. సంతోష్ కుమార్.. గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేయడంతో.. కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు, వారి పిల్లలు వంటి అనేకమంది సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా పోయారని గుర్తు చేశారు. ఈ లోటును పూరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చురుకుగా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారికే అధికంగా రేషన్ కార్డులు మంజూరయినట్లు తెలిపారు.


అయితే.. కేవలం కొత్త రేషన్ కార్డుల పంపిణీతోనే ఆగకుండా, ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రేషన్ కార్డు కలిగినవారు జూన్ 30వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువులోపు ఈ-కేవైసీ చేయించుకోని పక్షంలో, వారి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ప్రక్రియ ప్రభుత్వ పారదర్శకతను పెంచడం, అనర్హుల తొలగింపు ద్వారా నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.


మరో శుభవార్త ఏమిటంటే.. అధికారులు వెల్లడించిన దాని ప్రకారం.. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు, కొత్తగా పొందినవారు కూడా మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవచ్చు. ఇది లబ్ధిదారులకు ఎంతో సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు, రవాణా ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది.


రాష్ట్రంలో పౌర సరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయి. రైతులు, సామాన్యులు, పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఈ రేషన్ కార్డులు ఒక కీలక పాత్ర పోషిస్తాయి. అధికారులు గ్రామ స్థాయిలో, పౌర సరఫరాల కార్యాలయాల వద్ద ఈ-కేవైసీ ప్రక్రియకు సంబంధించిన సహాయాన్ని, అవగాహనను నిరంతరం అందిస్తున్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ రేషన్ కార్డులను సక్రమంగా వినియోగించుకోవాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో భాగం కావాలని కోరారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసే వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని.. వారికి కూడా త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa