తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ప్రధాన నదులు, ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహానికి తిప్పిరెడ్డి గంగాధర్ అనే యువకుడు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. గంగాధర్ చేపల వేట కోసం వెళ్ళి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
యువకుడిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. వరద ఉధృతి అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడిని గుర్తించడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తున్నాయి. గంగాధర్ కోసం అతడి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రాజెక్టు వద్ద ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో నదులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని అధికారులు పదేపదే హెచ్చరించినా, కొందరు ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం అది 693.700 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా, ఇప్పుడు 3.224 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 86,994 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి 1,56,376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రజలను నది పరివాహక ప్రాంతాలకు, ప్రమాదకరమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa