తెలంగాణ రాష్ట్రంలో రైతులు పంటలు పండించడంలో ఒకవైపు కష్టపడుతుంటే, మరోవైపు కోతులు, ఇతర వన్యప్రాణుల బెడద వారి శ్రమను నాశనం చేస్తోంది. పంటలను నాశనం చేస్తున్న కోతుల వల్ల రైతులు శారీరకంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం యూ అండ్ ఐ అనే కంపెనీ ఒక కొత్త పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఉపయోగించి.. రైతులు తమ పంటలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈ పరికరం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రైతు మేకల మహిపాల్ రెడ్డి అనుభవం..
కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, ఎలాబోతారం గ్రామానికి చెందిన రైతు మేకల మహిపాల్ రెడ్డి తన రెండు ఎకరాల పొలంలో మొక్కజొన్న పంటను పండిస్తున్నారు. పంట కోతుల బెడదకు గురికావడంతో మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఆలోచించారు. అతను హుజూరాబాద్లోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో పెద్ద శబ్దాలు చేసే ఒక ప్రత్యేక పరికరాన్ని కొనుగోలు చేసి, తన పంట పొలంలో అమర్చారు. ఈ పరికరం నుంచి వచ్చే శబ్దాలు విని, కోతులు, ఇతర జంతువులు పంట పొలానికి దూరంగా ఉంటున్నాయి.
రైతు మహిపాల్ రెడ్డి ప్రకారం.. ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉంది. దీనిలో వివిధ రకాల జంతువుల శబ్దాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్లూటూత్ ద్వారా దీనిని మొబైల్కు కూడా అనుసంధానించవచ్చు. ప్రస్తుతం.. ఆయన ఈ పరికరంలో ఏనుగుల అరుపులను రికార్డు చేసి ఉంచారు. ఆ శబ్దాలకు భయపడి కోతులు, ఇతర జంతువులు పొలం దగ్గరకు రావడం లేదు. ఇంకా పలు రకాల శబ్దాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపాడు. దీంతో మహిపాల్ రెడ్డి తన పంటను సులభంగా, సురక్షితంగా కాపాడుకుంటున్నారు.
సాధారణంగా, రైతులు తమ పంటలను కాపాడటానికి కాపలా ఉండటం, లేదా ఖరీదైన పద్ధతులను అనుసరించాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి కొత్త పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం ఇలాంటి స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి, పంట నష్టాన్ని తగ్గించి, రైతుల కష్టాలను తగ్గించవచ్చని మహిపాల్ రెడ్డి వంటి రైతుల అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa