తెలంగాణ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు స్థానికంగా ఆందోళనలకు దారితీశాయి. ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, నాగులవంచ రైల్వే స్టేషన్ను ఆదాయం తక్కువగా ఉందన్న కారణంతో రైల్వే శాఖ మూసివేసింది. దీనితో సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్టేషన్ భవితవ్యంపై స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, వ్యాపారులకు ఈ రైల్వే స్టేషన్ రవాణాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.
ప్రజల వినతులను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు ఎట్టకేలకు సానుకూలంగా స్పందించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. స్టేషన్ను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ చీఫ్ బుకింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు నాగులవంచ స్టేషన్ టికెట్ కౌంటర్ను ఆదివారం తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు.. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు జరిగింది ఇదీ..
గత కొన్ని రోజుల నుంచి ఈ రైల్వే స్టేషన్లో అభివృద్ది పనుల పేరిట టికెట్ కౌంటర్ను మూసివేశారు. అది తెలియక చాలా మంది ఇక్కడ టికెట్ కొనుగోలు కోసం వచ్చేవారు. అయితే స్టేషన్ అభివృద్ధి పనుల దృష్ట్యా తాము ఇక్కడ టికెట్స్ ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. తర్వాత మళ్లీ కౌంటర్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో చాలామంది అలానే ఎదురు చూశారు.. కానీ వారం రోజుల కిందట ప్రయాణికుల రద్దీ లేని కారణంగా స్టేషన్ మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు రావడంతో.. స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో మళ్లీ నేడు స్టేషన్ పున: ప్రారంభం జరిగింది.
రవాణా వ్యవస్థపై ప్రభావం..
నాగులవంచ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం స్థానిక ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, రోజువారీ పనికి వెళ్లే వారికి గొప్ప ఊరటనిచ్చింది. ఈ రైల్వే మార్గం తక్కువ ఖర్చుతో.. సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా సహాయపడుతుంది. ప్రజల ఐక్యత, ప్రజా ప్రతినిధుల కృషి వల్ల ఇలాంటి సానుకూల ఫలితాలు వస్తాయి. నాగులవంచ స్టేషన్ పునఃప్రారంభంతో భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. ఇక నుంచి ప్రయాణికులు ఇక్కడ నుంచి అటు విజయవాడకు.. ఇటు ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa