తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ల (సీఎస్పీ) ద్వారా డబ్బులు తీసుకునే వారికి ఈ సమస్య ఎదురవుతోంది. దివ్యాంగులకు రూ.4,016, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ.. కొందరు నిర్వాహకులు పై చిల్లరను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారు.
చాలామంది వృద్ధులు, నిరక్షరాస్యులకు తమ మొబైల్ ఫోన్లకు వచ్చే బ్యాంక్ ఎస్ఎంఎస్ల గురించి అవగాహన ఉండటం లేదు. మరికొందరికి ఫోన్లు కూడా ఉండవు. దీంతో వారు పూర్తిగా సీఎస్పీ నిర్వాహకులపై ఆధారపడుతున్నారు. ప్రతి నెలా బయోమెట్రిక్ వేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు.. నిర్వాహకులు మొత్తం డబ్బు డ్రా చేసి, పైచిల్లర ఇవ్వడం లేదు. ఈ మోసం గురించి చాలామంది లబ్ధిదారులకు తెలియడం లేదు. తెలిసినా.. సర్వీస్ ఛార్జీలు కావచ్చని అడిగేందుకు వెనకాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా డ్రా చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి కొంతమొత్తం తీసుకుంటున్నా, మొత్తం లబ్ధిదారుల నుంచి చూస్తే ఇది లక్షల్లో ఉంటోంది.
ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం, గోల్యాతండాకు చెందిన తేజావత్ సేట్యా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన రెండు నెలల పింఛను, పీఎం కిసాన్ డబ్బులు కలిపి డ్రా చేసుకున్న తర్వాత.. తనకు కేవలం రూ.6,000 మాత్రమే లభించగా.. బ్యాంక్ స్టేట్మెంట్లో మాత్రం రూ.6,050 డ్రా అయినట్లు గుర్తించారు. లచ్చాతండాకు చెందిన జాటోత్ కృష్ణ అనే వృద్ధుడు కూడా తన వృద్ధాప్య పింఛనులో ప్రతి నెలా రూ.20 తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలపై ఖమ్మం జిల్లా సీఎస్పీ ఇన్ఛార్జి విక్రమ్ స్పందిస్తూ.. లబ్ధిదారుల ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తం పూర్తిగా వారికి చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనంగా డబ్బులు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిస్తే, సమీప ఎస్బీఐ బ్రాంచ్లో ఫిర్యాదు చేయాలని.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa