రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ఒకవైపు ప్రజలు ప్రశంసిస్తుంటే, మరోవైపు పురుషులపై ఆర్టీసీ టికెట్ ధరలు నిర్ధారణ లేకుండా పెరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఈ విషయంలో శనివారం రాఖీ పండుగ రోజు చోటు చేసుకున్న సంఘటన ఒక్కటి ఈ అభిప్రాయాలకు నిలువెత్తు నిదర్శనం.తిమ్మాజిపేట నుంచి జడ్చర్లకు వెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రయాణికుడు, సాధారణంగా రూ.30గా ఉండే టికెట్ రూ.50కు పెరిగిందని గమనించి ఆశ్చర్యపోయాడు. ఛార్జీల ఈ రీతిలో పెరుగుదలపై అతను కండక్టర్ను ప్రశ్నించగా, “రాఖీ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం రేట్లు పెంచిందని” సమాధానం వచ్చింది. దీనిని విని ప్రయాణికుడు కొంత సంతాపానికి లోనయ్యాడు.మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ, అదే సమయంలో పురుషులపై అదనపు భారం విధించడం ఎంత వరకు న్యాయమనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములు చెల్లెళ్లకు బహుమతులు ఇస్తుంటే, ప్రభుత్వం మాత్రం వారి మీద టికెట్ ధరల పెంపుతో 'బహుమతి' ఇచ్చిందని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.ఉచిత పథకాల పేరుతో ఒక వర్గానికి ఆర్థిక లాభాలు అందిస్తూనే, మరో వర్గంపై భారం మోపడం సమర్థనీయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఛార్జీల పెంపు వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వెల్లడించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa