ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఆ రైల్వే గేట్ కష్టాలు తీరినట్లే..ఎట్టకేలకు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 04:16 PM

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైల్వే క్రాసింగ్ గేట్ల వల్ల సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్లు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు సర్వసాధారణం. రవాణాకు, ప్రజల రాకపోకలకు ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం రైల్వే అధికారులు అక్కడక్కడా ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నప్పటికీ.. ఇంకా చాలా చోట్ల నిర్మాణాలు అవసరం ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం, రామకృష్ణాపురం గ్రామం. ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులు, తమ పొలాలకు వెళ్లాలన్నా, ఇతర పనుల కోసం వెళ్లాలన్నా తరచుగా రైల్వే గేట్లు మూసి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


రామకృష్ణాపురం సమీపంలోని 107వ రైలు క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థానిక ప్రజలు, నాయకులు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఈ సమస్యను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 7న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో.. రైల్వే గేటు తరచూ మూసివేయడం వల్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ఈ అభ్యర్థనపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎంపీ రవిచంద్రకు తిరిగి లేఖ రాస్తూ.. ఈ బ్రిడ్జి నిర్మాణం అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు.


కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన హామీతో రామకృష్ణాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించామని ఆయన ఎంపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.


ఈ విధంగా మంత్రి స్పందించడం అనేది రామకృష్ణాపురం గ్రామస్తులకు ఎంతో ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తమ కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి.. బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజల రవాణా ఇబ్బందులు తొలగడమే కాకుండా.. సమయం కూడా ఆదా అవుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.


ఇదిలా ఉండగా.. ఇటీవల చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ మూసివేస్తున్నట్లు ప్రకటించి రైల్వే అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఆగస్టు 17వ తేదీ నుంచి ఆ రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్ ఓపెన్ చేశారు. ఈ విధంగా రైల్వే అధికారులు ప్రజల ఇబ్బందులను తెలుసుకొని.. సానుకూలంగా స్పందిస్తుండటంతో రైల్వే శాఖ పనితీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa