హైదరాబాద్ రామాంతపూర్లో ఆదివారం రాత్రి శ్రీకృష్ణుడి శోభాయాత్రలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక యువకుడు ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం అర్థరాత్రి శ్రీకృష్ణుడి శోభాయాత్రలో రథాన్ని లాగుతుండగా.. అది పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించి రథాన్ని లాగుతున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో మరో యువకుడు సైతం ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనతో ఆహ్లాదంగా సాగుతున్న శోభాయాత్రలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆ విషాదం వెనుక ఉన్న ఒక కుటుంబ వేదన హృదయాలను కలచివేస్తోంది. తండ్రి కళ్ల ముందే కుమారుడు మృత్యు ఒడిలోకి చేరుకోగా.. ఈ ఘటన ఆ కుటుంబాన్ని నిలువునా కుంగదీసింది. 24 ఏళ్ల కృష్ణ యాదవ్ తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రి రఘు యాదవ్కు, వంశానికి ఒకే ఒక్క మగపిల్లాడు. బాబాయ్, పెదనాన్న కుటుంబంలో అందరూ ఆడ పిల్లలే కాగా.. కృష్ణ యాదవ్ మాత్రమే మగ సంతానం. తండ్రి రఘు యాదవ్ గోఖలే నగర్ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆదివారం రాత్రి జరిగిన శోభాయాత్రలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి పర్యవేక్షించారు. అందరిలో ఉత్సాహం నింపిన కృష్ణ, ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై తండ్రి కళ్ల ముందే నిర్జీవంగా పడిపోయాడు. ఆ క్షణంలో ఆ తండ్రి అనుభవించిన వేదన వర్ణనాతీతం.
హే కృష్ణా.. ఏంటీ ఘోరం? అని ఆ తండ్రి పడిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టించింది. తనతో కలిసి నడిచిన కొడుకును ఇక ఎప్పటికీ చూడలేనని తెలుసుకున్న రఘు యాదవ్ గుండె పగిలేలా రోదించారు. కృష్ణయాదవ్ తల్లి బాధ మరింత దయనీయం. కొడుకా.. కొడుకా అంటూ ఆమె చేసిన రోదన ఆ ప్రాంతమంతా వినిపించింది. పక్కన ఉన్న బంధువులు, స్నేహితులు ఎంత ఓదార్చినా వారి దుఃఖం ఆగలేదు. ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని శాశ్వతమైన శోకంలో ముంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa