త్వరలోనే అతిపెద్ద పండుగ వినాయక చవితి రాబోతుంది. ఆగస్టు 27న గణేష్ చతుర్థి పర్వదినం. ఇక బొజ్జ గణపయ్య పండుగ అంటే హైదరాబాద్లో సంబరాలు మాములుగా ఉండవు. గల్లీగల్లీకో వినాయకుడు కొలువు దీరి భక్తుల సేవలు అందుకుంటాడు. తొమ్మిది రోజుల భక్తుల సేవలతో తరించిన అనంతరం గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటాడు. ఇక ఈ సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మొదలు.. నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీజీపీ జితేందర్, హెచ్ఎండీఏ కమిషనర్తో పాటుగా మూడు కమిషనరేట్ల అధికారులు, రంగారెడ్డి, హైదరాబాద్ , జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలను గొప్పగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల సాయంతో రాష్ట్రంలోనే కాక దేశంలోనే.. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ అంశంలో పోయిన ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంతో సాయం చేశారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తు చేశారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర రాజధానిలో జరిగే అతిపెద్ద వేడుక గణేష్ ఉత్సవాలకు సంబంధించి.. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్, ఆరోగ్య, పోలీస్ విభాగాలు కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, అలానే మండపాల వద్ద విద్యుత్ షాక్ వంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలానే నిమజ్జనం వేళ విగ్రహాలకు, వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. అలానే గణేష్ నిమజ్జానికి కూడా ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa