తెలంగాణ ప్రభుత్వం 2025-27 లైసెన్స్ కాలానికి రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు డిసెంబర్ 1, 2025 నుండి అమలులోకి వచ్చి, నవంబర్ 30, 2027 వరకు కొనసాగుతాయి. రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలి ముర్తాజా రిజ్వీ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, లాటరీ విధానం ద్వారా కొత్త మద్యం దుకాణాలను కేటాయిస్తారు. వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలుగా నిర్ణయించారు, ఇది గతంలో రూ. 2 లక్షల నుండి పెంచబడింది.
దుకాణాల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసింది. మొత్తం దుకాణాలలో 15% గౌడ సామాజిక వర్గానికి, 10% షెడ్యూల్డ్ కులాలకు, 5% షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. ఈ వర్గాలకు చెందినవారు మాత్రమే సంబంధిత రిజర్వేషన్ కేటగిరీల కింద దరఖాస్తు చేయడానికి అర్హులు. దుకాణాల సంఖ్య జిల్లాల జనాభా నిష్పత్తి ఆధారంగా నిర్ణయించబడుతుంది, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను రూ. 50 లక్షల నుండి రూ. 1.10 కోట్ల వరకు జనాభా ఆధారంగా నిర్ధారించబడింది. అదనంగా, ప్రతి దుకాణానికి రూ. 5 లక్షల ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ పన్ను విదించబడుతుంది.
వ్యాపార సమయాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. వాక్-ఇన్ స్టోర్లకు రూ. 5 లక్షల అదనపు రుసుముతో ప్రత్యేక అనుమతులు లభిస్తాయి. మద్యం బాటిళ్లను ముద్రిత రిటైల్ ధరలకే విక్రయించాలి, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్కు 27%, ప్రీమియం లిక్కర్ మరియు బీరుకు 20% లాభం మార్జిన్గా నిర్ణయించబడింది.
పారదర్శకత మరియు భద్రత కోసం, అన్ని దుకాణాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ కంట్రోల్ రూమ్తో అనుసంధానిత సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి. లైసెన్సుదారులు పరిశుభ్ర వాతావరణం, సరైన పార్కింగ్ సౌకర్యాలను కల్పించాలి. ఈ కొత్త విధానం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు, మద్యం వ్యాపారంలో నియంత్రణ మరియు పారదర్శకతను నిర్ధారించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa