తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవలు ప్రవేశపెట్టి విజయవంతంగా వస్తువులను చేరవేస్తున్నప్పటికీ.. కొన్ని పార్శిళ్లు గమ్యం చేరలేకపోతున్నాయి. వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ఆ వస్తువులను ఇప్పుడు బహిరంగ వేలంలో విక్రయిస్తున్నారు. డెలివరీ కాని ఈ సరుకులు ఆర్టీసీ గోదాముల్లో పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. చాలామంది కస్టమర్లు తప్పుడు చిరునామాలు లేదా పనిచేయని ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల పార్శిళ్లను వారికి చేర్చడం కష్టమవుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం.. 45 రోజుల్లోపు తీసుకోని వస్తువులను వేలం వేయడానికి ఆర్టీసీకి అధికారం ఉంటుంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కార్గో సేవలను అందించేందుకు ఆర్టీసీ 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి నెలా సుమారు 7,000 నుండి 8,000 వస్తువులను రవాణా చేస్తుండగా, వాటిలో 600 నుంచి 700 వరకు పార్శిళ్లు డెలివరీ కావడం లేదు.
ముఖ్యంగా జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వంటి ప్రధాన కేంద్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మొదటి వేలంలో 50 శాతం, రెండో వేలంలో 80 శాతం, మూడో వేలంలో 90 శాతం వరకు రాయితీతో వస్తువులను విక్రయిస్తున్నారు. గతంలో వేలం వేయగా మిగిలిన వస్తువులను జేబీఎస్లోని ప్లాట్ఫాం నెం.14 వద్ద బుధవారం నుండి మూడు రోజుల పాటు వేలం వేయనున్నారు.
ఈ వేలంలో 542 వస్తువులు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మొబైల్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు, ఆహార పదార్థాలు వంటివి ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేసుకున్న వస్తువులను కూడా కొందరు తీసుకోకపోవడం గమనార్హం. జేబీఎస్ వద్ద మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొని, తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ వేలం రేపు, ఎల్లుండి కూడా ఉంటుంది. ఆర్టీసీ అధికారులు ఈ వేలం ద్వారా కొంత ఆదాయం పొందుతూ, గోదాములలో పేరుకుపోయిన వస్తువుల సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa