ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 ఏళ్ల బాలుడి గాయాన్ని నాకిన వీధి కుక్క.. రేబిస్‌తో నెల రోజుల తర్వాత మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 08:00 PM

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా వీధి కుక్కల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు కనిపించకుండా.. వాటిని షెల్టర్లలోకి తరలించాలని ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత జంతు ప్రేమికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఈ తీర్పును పరిశీలించనున్నట్లు స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. రేబిస్ కారణంగా 2 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. బుదౌన్ జిల్లాలోని సుజత్‌గంజ్ బేలా గ్రామానికి చెందిన మహమ్మద్ అద్నాన్ అనే 2 సంవత్సరాల బాలుడు.. ఇటీవల రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడికి గతంలో ఓ గాయం అయిందని.. అయితే ఆ గాయాన్ని నెల రోజుల క్రితం ఒక వీధి కుక్క నాకినట్లు మహమ్మద్ అద్నాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆ సమయంలో కుక్క కాటు వేయలేదని.. కేవలం నాకిందని భావించిన బాలుడి తండ్రి మహ్మద్ అనీస్ దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. కానీ అదే వారి పాలిట పెను శాపంగా మారింది. వీధి కుక్క నాకడంతో దాని లాలాజలం నుంచి.. ఆ బాలుడికి రేబిస్ వ్యాధి సోకినట్లు.. ఆ తర్వాత నిర్ధారించారు.


 కొన్ని రోజుల తర్వాత మహమ్మద్ అద్నాన్‌ విచిత్రంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రేబిస్ తీవ్రస్థాయికి చేరుకున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. చివరికి చికిత్స పొందుతూ ఈ ఘటన జరిగిన నెలరోజుల తర్వాత అద్నాన్ చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన మరోసారి వీధి కుక్కల స్వైర విహారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఆ గ్రామంలోని సుమారు 30 మంది రేబిస్ టీకా తీసుకున్నట్లు స్థానికులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa