అప్పటి వరకు బాగానే కలిసి మెలిసి ఉన్న ఆలుమగలు ఒక్కసారిగా గొడవలకు దిగుతుంటారు. ఇంకొంత మంది అయితే విడాకుల వరకు వెళ్తారు. వీటన్నింటికి చాలా సార్లు వ్యక్తిగత సమస్యలే కారణమవుతాయి. కానీ ఇటీవల కాలంలో టీవీ సీరియల్స్ కూడా కుటుంబ బంధాలను తారుమారు చేస్తున్నాయి. వీటికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిలో తాజాగా తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఒక టీవీ సీరియల్ కోసం ఏర్పడిన వాగ్వాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పెడుతాయన్న విషయం ఎవరూ ఊహించని విధంగా ఉంది.
బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన రైతు కుటుంబం ఉదయం పొలం పనులకెళ్లి రాత్రి అలసటగా ఇంటికి చేరింది. భర్త ఆకలిగా ఉన్నాడని చెప్పగా భార్య మాత్రం టీవీ స్క్రీన్ ముందు కూర్చొని సీరియల్లో మునిగిపోయింది. సీరియల్ అయిపోగానే వడ్డిస్తానని భార్య సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం విన్న భర్తకు తీవ్ర ఆగ్రహం వచ్చింది.
భర్త “సీరియల్ ముఖ్యమా? నేను ముఖ్యమా?” అని ప్రశ్నించడంతో వాగ్వాదం పెద్దదయ్యింది. ఆగ్రహంతో భార్య తన కొడుక్కి పురుగుమందు తాగించి తానూ తాగేసింది. ఆ సమయంలో గమనించిన భర్త షాక్కు గురై స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం భార్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటన ఇటీవల విడుదలైన శుభం సినిమాను గుర్తుచేస్తోంది. ఆ సినిమాలో కూడా భార్య టీవీ సీరియల్స్లో మునిగి, భర్తను పట్టించుకోకుండా చూపించడం వల్ల కుటుంబంలో భర్తకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ సినిమా ఒక కల్పితం అయినా.. నిజజీవితంలోనూ అదే రీతిలో జరిగిపోవడం సమాజం ఎంత దురదృష్టకర పరిస్థితికి చేరిందో సూచిస్తోంది. వినోదం కోసం టీవీ చూడడం తప్పు కాదు.. కానీ అది మన రోజువారీ జీవనశైలిని ప్రభావితం చేసే స్థాయికి వెళ్లకూడదు. కుటుంబం, పిల్లలు, సంబంధాలు అన్నీటి కంటే సీరియల్స్ ముఖ్యమని భావించడం సమాజానికి ప్రమాదకరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa