తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. ఎన్నో నెలలుగా బిల్లులు ఆలస్యమవడం వల్ల వంటకార్మికులు అప్పులు తెచ్చుకుని పని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ ఛానెల్ విధానం ద్వారా పరిష్కారం చూపనుంది. ప్రతి నెల 10వ తేదీ లోపు వేతనాలు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేలా కొత్త పద్ధతి రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండటంతో.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికారులు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపారు. ఒకసారి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 వేల పాఠశాలల్లో పనిచేస్తున్న 52 వేల వంట కార్మికుల కష్టాలు తగ్గిపోతాయి.
పాఠశాలవారీగా బిల్లులు యాప్ ద్వారా..
ఈ కొత్త విధానంలో ప్రతి నెలాఖరులో పాఠశాలవారీగా బిల్లులు యాప్ ద్వారా వస్తాయి. ఆ బిల్లులకు హెడ్మాస్టర్ ఆమోదం తెలపగానే.. ఎంఈవో పరిశీలించి అంగీకరిస్తే, మొత్తం ట్రెజరీ ద్వారా నేరుగా బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎండీఎం యాప్ రూపొందించారు. ఇప్పటిదాకా ఉన్న సుదీర్ఘ పద్ధతి కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతుండగా.. కొత్త విధానం పారదర్శకంగా, వేగంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మధ్యాహ్న భోజన పథకంకి ప్రతి సంవత్సరం సుమారు రూ.540 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటారు. నెలకు దాదాపు రూ.55 కోట్లు అవసరం అవుతాయి. ఈ మొత్తం ముందుగానే అందుబాటులో ఉంటేనే గ్రీన్ ఛానెల్ సజావుగా అమలు అవుతుంది. అందుకోసం ఆర్థికశాఖకు సీఎం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. దీని వల్ల వంటకార్మికులు ఆర్థిక ఒత్తిడి లేకుండా సేవలు అందించగలరని... విద్యార్థులకు సమయానికి పోషకాహార భోజనం అందుతుందని ఆశిస్తున్నారు. అంతే కాకుండా.. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa