ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇండ్ల విస్తీర్ణంలో వెసులుబాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 07:43 PM

తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకం కింద.. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే.. ఇంటి విస్తీర్ణానికి సంబంధించి ప్రభుత్వం పెట్టిన ఒక నిబంధనపై ఇటీవల చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రకారం.. ఇళ్లు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలి. ఈ పరిమితి నిజంగా పేద కుటుంబాల జీవన అవసరాలను తీర్చగలదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


ఈటల రాజేందర్ ప్రతిపాదనలు..


ఈ సమస్యపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. హుజూరాబాద్‌లోని గతంలో నిర్మించిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రూ. 5 లక్షలు సరిపోవని.. నిర్మాణ ఖర్చు దాదాపు రూ. 12 లక్షల వరకు అవుతోందని ఈటల వివరించారు. లబ్ధిదారులు సొంతంగా అదనపు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఇంటి విస్తీర్ణాన్ని పెంచాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


ఇందిరమ్మ ఇళ్లు నిజంగా అవసరం ఉన్న పేదలకే దక్కేలా ఎంపిక ప్రక్రియలో పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించాలని ఈటల సూచించారు. ఇంటి నిర్మాణం అనేది ఒక కుటుంబ కల.. కాబట్టి వాస్తు వంటి అవసరాల కోసం లబ్ధిదారులకు కొంత మార్పు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ప్రభుత్వానికి శక్తివంతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నందున.. నిజమైన అర్హులను గుర్తించడం కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించడం ప్రజల్లో ఆశలు పెంచింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరింత సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


భవిష్యత్ ప్రణాళికలు..


ఈ ఇళ్ల విస్తీర్ణ సమస్యపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పథకం భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పేదల అవసరాలను బట్టి ఇళ్ల నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచితే.. లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయి. అలాగే.. నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉన్నందున.. దానిపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణ రంగానికి ఊతమిస్తుంది. ఇదిలా ఉండగా.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa