ఇంజనీరింగ్ విద్యార్థులకు.. జేఎన్టీయూ (JNTU) క్యాంపస్లో సీటు సాధించడం ఒక కల. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈఏపీసెట్ (EAPCET) పరీక్షలో మంచి ర్యాంకు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రతీ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు మిగలడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి స్పాట్ ప్రవేశాల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. కానీ ఈ సారి అనూహ్యంగా జేఎన్టీయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోవడం విద్యా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. జేఎన్టీయూ హైదరాబాద్ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఆగస్టు 26వ తేదీ నుంచి స్పాట్ ప్రవేశాలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ..
ఈ స్పాట్ ప్రవేశాలు విద్యార్థులకు మరొక అవకాశం. కౌన్సెలింగ్లో సీటు దక్కని వారు, లేదా జాతీయస్థాయిలో సీటు రాక ఇక్కడ చేరాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం వల్ల విద్యా సంస్థలకు నష్టాలు తగ్గుతాయి. అలాగే, విద్యార్థులకు మంచి కళాశాలల్లో సీటు దొరుకుతుంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం వర్సీటీ క్యాంపస్ తో కలుపుకుంటే 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిలిపోయినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డా.బి.బాలునాయక్ తెలియజేశారు. వీటిలో క్యాంపస్లో 23 సీట్లు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వీటిలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా 13 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. క్యాంపస్ తో పాటు.. సుల్తాన్ పూర్ లో ఆగస్టు 26వ తేదీన.. జగిత్యాల, మంథనిలో ఆగస్టు 28న.. వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కళాశాలల్లో ఈ నెల 29వ తేదీన ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. అర్హత గల వారు తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో హాజరు కావాలని తెలిపారు.
సీట్లు మిగలడానికి ప్రధాన కారణాలు..
ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు చాలా మంది ఐఐటీ (IITs), ఎన్ఐటీ (NITs) వంటి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చేరడానికి మొగ్గు చూపారు. అంతేకాకుండా.. కంప్యూటర్ సైన్స్తో పాటు, సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి వాటికి కూడా డిమాండ్ పెరగడం ఒక ఆసక్తికరమైన అంశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa