ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని గుర్తు చేసిన కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 06:59 PM

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలను ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకొని ఉప ఎన్నికలకు రావాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు.పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో ఓటమి భయం మొదలైందని కేటీఆర్ అన్నారు. అందుకే వారు రాజీనామా చేసేందుకు వెనుకాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల బ్లాక్‌మెయిల్ దందాల కోసమే 'హైడ్రా' వ్యవస్థ పనిచేస్తోందని, దాని ఆగడాల వల్ల ఒకప్పుడు దేశానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు కంటే, రేవంత్ రెడ్డి కేవలం 20 నెలల కాలంలోనే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని కేటీఆర్ నిలదీశారు.గతంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలో ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. దీంతో నగరంలో ఇన్వర్టర్లు, జనరేటర్ల అవసరమే లేకుండా పోయిందన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయకుండా హైదరాబాద్‌ను అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండేలా అభివృద్ధి చేశామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తూ మతసామరస్యాన్ని కాపాడామని అన్నారు. అందుకే 2023 ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా గులాబీ జెండాకే పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.శేరిలింగంపల్లి ఎమ్మెల్యేతో సహా పార్టీ మారిన వారంతా ప్రజల కోసం కాదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే కాంగ్రెస్‌లో చేరారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజలకు మేలు చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం టైంపాస్ మాటలు చెబుతూ, కేసీఆర్‌పైన, తనపైన కేసులు పెడతామని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాయకులు పార్టీని మోసం చేసి వెళ్లినా, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa