ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా.. ఎవరడ్డొస్తారో చూస్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 07:32 PM

తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యామ్నాయ పదం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ రాజకీయాలను శాసించిన ఎందరో ప్రముఖులు ఈ వర్సిటీలో చదువుకున్నవారేనని ఆయన గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి గొప్ప నాయకులు ఈ విద్యాసంస్థ నుంచే వచ్చారని వివరించారు. ఇవాళ వర్సటీని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ అనంతరం అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.


కొందరు వ్యక్తులు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని చూశారని, కానీ తాము దానికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీకి ఒక దళితుడిని వైస్ ఛాన్సలర్‌గా నియమించి చూపించామని అన్నారు. అలాగే దేశానికి యువ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ పురిటిగడ్డగా నిలిచిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూనివర్సిటీలు కేవలం సమస్యలపై చర్చలకే కాకుండా, సైద్ధాంతిక అంశాలకు కూడా వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. సామాజిక, సాంకేతిక అంశాలపై విస్తృత చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


ముఖ్యమంత్రిగా తాను మళ్లీ యూనివర్సిటీకి వస్తానని, ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ సభ పెడతానని రేవంత్ రెడ్డి సవాల్ వెల్లడించారు. ఎవరు అడ్డం వస్తారో చూస్తానని హెచ్చరించారు. విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అననని, క్యాంపస్‌లో ఒక్క పోలీసు కూడా ఉండడని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపించేందుకు జీవోలు జారీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణలో ఏనుగులు, మృగాలు లేవని.. ఉన్న క్రూర మానవ మృగాలు ఫాంహౌస్‌లకే పరిమితమయ్యాయని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్‌కు పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. 'మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండాలా?' అంటూ గత ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజుల్లో ప్రొఫెసర్ కోదండరామ్‌ను చట్టసభలకు పంపుతామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa