తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసిపోనీయకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్తో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ ప్రమాణాలకన్నా మించి అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాని ప్రత్యేక కమిటీని నియమించి, ఇంజినీరింగ్, విద్యా నిపుణులతో కలిసి విశ్వవిద్యాలయం కోసం సమగ్ర అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఈ లక్ష్యానికి కావలసిన నిధులను ఎంతైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలోనే కాదు, వాటిని మించి పోటీ పడగల విశ్వవిద్యాలయంగా ఉస్మానియాను తీర్చిదిద్దాలని సీఎం అభిలషించారు.
ఈ ఏడాది విద్యా రంగానికి ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఉస్మానియా అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించేందుకు సిద్ధమని వెల్లడించారు. అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ వంటి ప్రాజెక్టులకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజానికి ఉస్మానియాకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, ఈ వర్సిటీని పూర్వ వైభవానికి తీసుకెళ్లడమే తన కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు.
ఈ వేదిక కేవలం చదువులకే పరిమితం కాకుండా సామాజిక చైతన్య ఉద్యమాలకూ ప్రేరణనిచ్చేలా రూపుదిద్దాలని అభిప్రాయపడ్డారు. యువత దేశ భవిష్యత్తు అని, వారికి నాణ్యమైన విద్య మాత్రమే నిజమైన సాధనమని గుర్తు చేశారు. అలాగే విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు, సిద్ధాంతపరమైన చర్చలకు వేదిక కావాలని, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా కార్యక్రమాలు జరగాలని సూచించారు. చిన్న వయసులో వ్యసనాల బారిన పడకుండా, విద్యార్థులు సమాజాన్ని నడిపించే మేధావులుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa