ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నేతకు 'ఫుట్‌బాల్' గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:31 PM

తెలంగాణ బీజేపీ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలోని కొందరు నేతలు తీరు పట్ల ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలం పార్టీలో తనను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీలోని ఓ నేతకు ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చి.. తన నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలె బీజేపీ కార్యకర్తల గురించి కొండా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. తాజాగా మరోసారి ఆయన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో తనను కొందరు వ్యక్తులు కావాలని టార్గెట్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.


తెలంగాణ బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీకి మంగళవారం ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీలో కొందరి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని.. కొందరు తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.


ఈ సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చంద్రశేఖర్‌ తివారీని కలిస్తే.. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును కలవమంటున్నారని చెప్పారు. దీంతో తాను వెళ్లి రామచందర్‌ రావును కలిస్తే.. ఆయన అభయ్‌ పాటిల్‌ను కలవమంటున్నారని.. ఇలా ఒకరి దగ్గరికి వెళ్తే.. వాళ్లు మరొకరి పేరు చెబుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో నెలకొన్న సమన్వయం లేకపోవడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


మరోవైపు.. ఇటీవలె కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆయన రెడ్డి మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్తుండగా.. అక్కడికి చేరుకున్న ఓ నాయకుడు.. ‘మీకు బీజేపీ కార్యకర్తలు అవసరం లేదా’ అని ప్రశ్నించాడు. దానికి బదులుచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తనకు కార్యకర్తలతో పనిలేదని సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. బీజేపీ కార్యకర్తల విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టడంతో సంచలనం రేపింది. తాజాగా మరోసారి.. పార్టీ నేతలపైనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన కమలం పార్టీలో పొసగలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa