ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భారీగా ఉద్యోగాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 03:55 PM

రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మూసీ మురుగును శుద్ధి చేసి.. దీనిలో స్వచ్ఛమైన గోదావరి జలాలను పారిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈక్రమంలో తాజాగా మూసీ సుందరీకరణ దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి పనులను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అతి త్వరలోనే మూసీ సమగ్రాభివృద్ధి పనులను ప్రారంభిస్తారని సమాచారం. ఎంఆర్‌డీసీఎల్‌ (మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది పరివాహక ప్రాంతం 55 కిలోమీటర్లు ఉండగా.. తొలి దశంలో 20.5 కిలోమీటర్ల మేర నదిని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. సుమారు రూ.5,641 కోట్ల వ్యయంతో మూసీ నది సుందరీకరణ చేపట్టనున్నారు.


తొలి దశ మూసీ సుందరీకరణ పనుల కోసం ఏడీబీ(ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రేవంత్ సర్కార్.. మూసీ ప్రక్షాళన పనులను వేగవంతం చేస్తోంది. దీని కోసం నిర్మించిన కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్‌ని రూపొందించింది. తొలి దశ పనులను రెండు సబ్ ఫేజ్‌లుగా విభజించారు. ఫేజ్ 1ఏలో హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 9.5 కిలోమీటర్లు.. అలానే ఫేజ్‌–1బీలో ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు.


ఫేజ్‌–1ఏ కోసం రూ.2,500 కోట్లు, ఫేజ్‌–1బీకి రూ.3,141 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తంలో సుమారు రూ.4,100 కోట్లు ఏడీబీ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనుంది.


మూసీ సుందరీకరణలో భాగంగా.. తొలి దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి 493 ఎకరాల (199.89 హెక్టార్లు) భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే.. ముందుగా వ్యర్థాలతో నిండిపోయిన నదిని శుభ్రం చేయాలి. ఇందుకోసం నదిలో 2 మీటర్ల లోతు వరకు వ్యర్థాలు, పూడిక తీయనున్నారు. ఆ తర్వాత నదికి రెండువైపులా రిటైనింగ్‌ వాల్‌లను నిర్మిస్తారు. అనంతరం మూసీ నదిలోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఈ నీళ్లు నిరంతరం ప్రవహించేలా చూస్తూ గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు బోటింగ్‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు.


మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో 100 శాశ్వత పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేస్తారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన మరో 3 వేల మంది ఉద్యోగులను నియమింస్తామని తెలిపారు. ఆ తర్వాత 200 శాశ్వత పోస్టులతో పాటు మరో 200 తాత్కాలకి పోస్టులు ఏర్పాటు చేసి నియామకాలు జరుపుతారని అధికారులు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa