హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే రద్దీకి సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో బస్సుల్లో రద్దీ రెండు రెట్లు పెరిగింది. సీట్లు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
అలానే నగరంలో కాలుష్యం తగ్గించే ప్రక్రియలో భాగంగా సర్కార్.. ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించింది. ప్రస్తుతం నగరంలో 200కు పైగా విద్యుత్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఇదిలా ఉండగా త్వరలోనే నగరానికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని.. అందుకు తగ్గట్టుగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని.. అలానే నగరంలో 12 కొత్త బస్ టెర్మినల్స్ నిర్మిస్తామని హైదరాబాద్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఆ వివరాలు..
నగరంలో 12 కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. అలానే నగరానికి వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని తెలిపారు. వాటి కోసం ఛార్జింగ్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామనివెల్లడించారు. అలానే నగరంలో రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందన్నారు. అలానే నగరంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల డిమాండ్లకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని ఆయన వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 500 ఎలక్ట్రిక్ బస్సులు కావాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. వీటిల్లో 225 బస్సులు ఆగస్టు నాటికి రాష్ట్రానికి వచ్చాయి. మిగిలిన 275 బస్సులు దశలవారీగా వస్తాయి. నవంబరులో 50, డిసెంబరులో 50, జనవరిలో 50, ఫిబ్రవరిలో 50, మార్చిలో 75 బస్సులతో కలిపి మొత్తం నగరానికి వస్తాయి అని వెల్లడించారు.
నగరంలోని బాలానగర్, హైటెక్సిటీ, జీడిమెట్ల, లింగంపల్లి, కూకట్పల్లి, కాళీమందిర్, వేవ్రాక్, కేపీహెచ్బీ కాలనీ, వేవ్రాక్, ఐఎస్సదన్, ఘట్కేసర్, గండిమైనమ్మ, ఉప్పల్ ప్రాంతాల్లో కొత్త బస్సు టెర్మినళ్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, ఆర్థిక వెసులుబాటును బట్టి ఈ టెర్మినళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
బస్సుల్లో రద్దీ సమస్యను తగ్గించడానికి.. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఆర్డినరీ బస్సులతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా విద్యార్థుల బస్సు పాసులను అనుమతిస్తున్నామని చెప్పుకొచ్చారు. శివారు ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా వివిధ డిపోల నుంచి 864 అదనపు ట్రిప్పులు నడుపుతున్నామని.. అలాగే, 275 మెట్రో డీలక్స్ బస్సులను ప్రధాన రూట్లలో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున తిప్పుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa