సికింద్రాబాద్ ప్రాంతంలో దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జి (ఉక్కు వంతెన) నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు నిర్మించ తలపెట్టిన ఈ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తాజాగా టెండర్లను ఆహ్వానించింది. దీంతో ఈ మెగా ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.నగరవాసులతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు శాపంగా మారిన ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్పేట వరకు మొత్తం 18.170 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ. 2,232 కోట్ల వ్యయం అవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.ఈ మొత్తం కారిడార్లో 11.65 కిలోమీటర్ల భాగాన్ని పూర్తిగా ఉక్కుతో నిర్మించనున్నారు. ఇది దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించనుంది. కేవలం పునాదులు మాత్రమే కాంక్రీట్తో నిర్మించి, పైవంతెన మొత్తం స్టీల్తోనే పటిష్ఠంగా, తక్కువ సమయంలో పూర్తి చేసేలా అధికారులు డిజైన్ చేశారు. ఈ కారిడార్ ప్యారడైజ్ నుంచి వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా సాగుతుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా హకీంపేట ఆర్మీ ఎయిర్పోర్టు సమీపంలో 450 మీటర్ల మేర అండర్గ్రౌండ్ టన్నెల్ కూడా నిర్మించనున్నారు. ఆ తర్వాత సుమారు ఆరు కిలోమీటర్ల రహదారిని ఆరు లైన్లతో విస్తరించనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్లను పిలవడంతో, నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa