ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలయ్ బలయ్‌‌లో ,,,,4 వేల కేజీల చికెన్.. 1200 కేజీల మటన్.. 86 రకాల వంటకాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 07:06 PM

దసరా పండుగ ముగిసిన తర్వాత రోజు ప్రతీ సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఆ ఉత్సవాల సందడిని కొనసాగిస్తూ.. బీజేపీ అగ్ర నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అలయ్ బలయ్' కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ భేదాలు, సినీ ప్రముఖులు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి చేర్చే ఈ ఆత్మీయ కలయిక రాష్ట్రంలో ఒక ప్రత్యేక సాంస్కృతిక వేడుకగా మారింది.


సుదీర్ఘ కాలంగా దత్తాత్రేయ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈసారి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయలక్ష్మి ముందుకు నడిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి అర్జున్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, వేలాది మంది జనం ఈ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తూ.. దత్తాత్రేయ నిర్వహణలోని ఈ ఆత్మీయ సమ్మేళనం దసరా ఉత్సవాన్ని రెండు మూడు రోజులు జరుపుకున్నంత ఆనందాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు.


అలయ్ బలయ్ అంటే కేవలం రాజకీయ కలయిక మాత్రమే కాదు, తెలంగాణ వంటకాల అద్భుతమైన విందు అని చెప్పవచ్చు. ఈసారి నిర్వాహకులు ఆహుతుల కోసం మెనూను అత్యంత వైభవంగా సిద్ధం చేశారు. మొత్తం 86 రకాల రుచులను వండించినట్లు నిర్వాహకులు తెలిపారు. అతిథుల కోసం సుమారు 40 క్వింటాళ్ల (4,000 కేజీలు) చికెన్ కర్రీ మరియు ఫ్రై, మరో 12 క్వింటాళ్ల (1,200 కేజీలు) మటన్ కర్రీ మరియు ఫ్రైని సిద్ధం చేశారు. వీటితో పాటు రొయ్యలు, చేపల పులుసులు , వేపుళ్లు కూడా మెనూలో ఉన్నాయి.


ఒకేసారి 500 మంది భోజనం చేయడానికి అనువుగా డైనింగ్ హాళ్లను అమర్చారు. మొత్తం 8 వేల మందికి భోజనాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శాఖాహారంతో సహా మొత్తం 86 రకాల వంటకాలు ఈ విందులో కనువిందు చేశాయి.


ఈ వేడుకలో 400 మంది కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు హాజరైన వారిని విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా.. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. అలయ్ బలయ్ అంటే ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అని, ఇది శ్రీరాముడు ఆంజనేయుని ఆలింగనం చేసుకున్న కాలం నాటి సంస్కృతి అని వివరించారు. ఈ కార్యక్రమం నేటి సమాజానికి ఆప్యాయత, ఆత్మీయతలను అందిస్తుందని అన్నారు. సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ.. 2005 నుండి దత్తాత్రేయ ఈ వేడుకను రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం సంతోషకరం అని, ఇలాంటి కార్యక్రమాలు మనమంతా ఒక్కటే అనే విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని కొనియాడారు. దసరా పండుగ తర్వాత కూడా ఈ స్థాయి జన సందోహం, అభిమానం దత్తాత్రేయపై ప్రజలకు ఉన్న మమకారాన్ని చాటుతుందని మంత్రి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa