ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 08:01 PM

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులపై తరచుగా జరుగుతున్న దాడులు, కాల్పుల ఘటనలు వారి కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా.. అమెరికాలోని డెంటన్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి పోలే చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.


టెక్సాస్‌లోని డెంటన్‌‌లో కాల్పులు..


హైదరాబాద్, ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి ప్రాంతానికి చెందిన పోలే చంద్రశేఖర్ (17) 2023లో భారతదేశంలో బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) పూర్తి చేశాడు. ఉన్నత విద్య, మెరుగైన భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన ఆయన.. టెక్సాస్‌లోని డెంటన్‌ నగరంలో నివాసం ఉంటూనే చదువుకు అండగా ఉండేందుకు ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.


ఈరోజు తెల్లవారుజామున.. అతడు డ్యూటీలో ఉండగా ఒక దుండగుడు జరిపిన అకస్మాత్తు కాల్పుల్లో చంద్రశేఖర్‌కు బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనతో స్వదేశంలో ఉన్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడనుకున్న తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే వార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు.


ప్రభుత్వాల పరామర్శ..


ఈ విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. చంద్రశేఖర్ మృతి తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాకుండా.. చంద్రశేఖర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అతని భౌతిక కాయాన్ని స్వస్థలమైన హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే.. మాజీ మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఎన్ రెడ్డి నగర్‌లోని బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. తల్లిదండ్రులు పడుతున్న వేదన చూసి గుండె తరుక్కుపోతోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.


విదేశాల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళన..


ఉన్నత చదువుల పేరుతో అమెరికా వంటి అగ్రరాజ్యాలకు వెళ్తున్న భారతీయ యువత, అక్కడ జరిగే అల్లర్లు, గొడవలు, కాల్పులు, రోడ్డు ప్రమాదాలకు బలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటున్న విద్యార్థులు ఇలాంటి హింసాత్మక ఘటనలకు గురికావడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చంద్రశేఖర్ మృతి నేపథ్యంలో.. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు తమ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా విదేశీ దౌత్య కార్యాలయాల ద్వారా ఈ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa