ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ గ్రామాలకు.... 6 లైన్ల రహదారి ఇక 8 లైన్లుగా విస్తరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 09:15 PM

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు, ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణాలపై నెలకొన్న అయోమయాన్ని తొలగిస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టతనిచ్చారు. రహదారుల విస్తరణ, నిర్మాణ పనులపై వదంతులు నమ్మొద్దని రైతులకు ఆయన సూచించారు. శనివారం చిట్యాల మండలంలో జరిగిన ఒక బహిరంగ సభలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన రెండు రోడ్డు ప్రాజెక్టుల పురోగతి గురించి ప్రస్తావించారు.


జాతీయ రహదారి 65 విస్తరణ:


ఈ రహదారి విస్తరణ పనులకు సంబంధించి డిసెంబర్ నెలలో టెండర్లు పిలుస్తామని.. ఆ తర్వాత వెంటనే జనవరిలో విస్తరణ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ జాతీయ రహదారిని 6 లైన్ల నుంచి 8 లైన్లుగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రహదారి పక్కన ఆనుకొని ఉన్న గ్రామాలు, పట్టణాలకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగించవచ్చు.


భారతదేశంలోని ఈ ప్రముఖ జాతీయ రహదారి 65 నాలుగు రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది. ఈ రహదారి ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇది మహారాష్ట్రలోని పూణే నగరం వద్ద మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం వద్ద అంతమవుతుంది.ఈ మార్గంలో ముఖ్యంగా పూణే, సోలాపూర్, హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ మరియు మచిలీపట్నం వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ రహదారిలో అత్యంత ముఖ్యమైన విభాగం హైదరాబాద్, విజయవాడ మధ్య ఉంది. ఈ భాగాన్ని సాధారణంగా విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా NH-65 అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించేటప్పుడు.. ఇది హైదరాబాద్‌నుంచి బయలుదేరి చౌటుప్పల్, చిట్యాల్, నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మునగాల, కోదాడ వంటి కీలక పట్టణాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దును చేరుకుంటుంది.


రీజినల్ రింగ్ రోడ్డు (RRR):


ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి కోరారు. RRR అలైన్‌మెంట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు, రైతులు తమ భూములను కోల్పోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు. అలైన్‌మెంట్ విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదని, రైతుల భూములు కోల్పోయే పరిస్థితి లేదని మంత్రి వివరించారు.


రైతులకు భరోసా..


రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా దివిస్ కంపెనీ ప్రయోజనాల కోసం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మారుస్తున్నట్లు వస్తున్న మీడియా కథనాలను మంత్రి పూర్తిగా ఖండించారు. RRR నిర్మాణానికి సంబంధించి ఒకసారి అలైన్‌మెంట్ ఖరారైన తర్వాత.. ఆ మార్గంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా, రాజకీయ నాయకుల భూములు ఉన్నా మార్చే ప్రసక్తే లేదని ఆయన హామీ ఇచ్చారు.


అలైన్‌మెంట్ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తయ్యాక.. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మంత్రిమండలిలో కూలంకషంగా చర్చించిన అనంతరం రైతులకు పూర్తి న్యాయం చేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఆర్ఆర్ఆర్ వెళ్లే ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి, రైతులను వ్యక్తిగతంగా కలిసి, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని.. వారిని ఒప్పించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీలతో.. భూములు కోల్పోతామనే భయంతో ఉన్న వేలాది మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కందిమల్ల శశిపాల్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa