తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్లు దండుకోవడానికే ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు.రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతూ, మరోవైపు మూసీ సుందరీకరణకు ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం కమీషన్ల కోసమే చేపట్టిన పథకమని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావును చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, ఆ భయంతోనే ఆయనపై నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.రాష్ట్ర బీజేపీ నేతలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో 8 మంది ఎంపీలను గెలిపిస్తే, వారు రాష్ట్రానికి కనీసం 8 యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేయడం వృథా అని ఆ పార్టీ ఎంపీలే స్వయంగా నిరూపించారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని పరిహసించారు.రైతుల సమస్యలపై మాట్లాడుతూ, రాష్ట్రంలో వెంటనే మక్క, సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa