తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన గోపాల్ రెడ్డిని ఉద్దేశించి, కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
పిటిషనర్ గోపాల్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టులో 'స్టే' ఇవ్వకపోవడంతోనే అత్యవసరంగా ఇక్కడికి వచ్చామని సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక కేసు కింది కోర్టులో లేదా హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు, అక్కడ స్టే లభించలేదన్న ఒకే ఒక్క కారణంతో నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సరైన విధానం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను స్వీకరించడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది.
దీంతో, తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో (GO Ms. 9) ను సవాల్ చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, తదుపరి విచారణ మొత్తం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు పరిధిలోనే కొనసాగనుంది. హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ కేసుపై ఎల్లుండి, అంటే బుధవారం (అక్టోబర్ 8) నాడు విచారణ జరగనుంది. ఈ విచారణ ఫలితంపైనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు సాగడం ఆధారపడి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని 42 శాతానికి పెంచడంపై అనేక న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి పోతున్నాయనేది ప్రధాన అభ్యంతరం. ఈ అంశంపై హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టు తప్పుకోవడంతో, హైకోర్టులో జరగబోయే విచారణ రాష్ట్ర రాజకీయాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలక మలుపుగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa