ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఈ పేరే ఫైనల్ అయిందా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:46 PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ తేదీలను ప్రకటించడంతో రాష్ట్రంలో అందరిచూపు జూబ్లీహిల్స్‌పైనే పడింది. అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో.. నవంబర్ 14న తేలనుంది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కానీ అభ్యర్థి విషయంలో హస్తం పార్టీ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి క్షణంలో అశావహులు పావుల కదిపితే తప్ప.. వారినే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.


కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ ఆశావహులు.. అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అందుకోసం సీనియర్ల దృష్టిలో పడటానికి అనేక విన్యాసాలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఖరారు కాకముందే బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం చేశారు. మరోవైపు, నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందించారు. ఇక మాజీ మంత్రి కోడలు కంజర్ల విజయ లక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు.


టికెట్ వారికే.. ఫైనల్!


జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ యాదవ్ లేదా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనికోసం భారీ ఎత్తున లాబీయింగ్ కూడా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ యాదవ్‌ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే.. నవీన్ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందని టాక్. నవీన్‌కు అన్నివర్గాల ప్రజల, పార్టీ సీనియర్ల మద్దతు ఉంది. మరోవైపు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఆయన్ను ఔట్‌సైడర్‌గా భావిస్తున్నారట పార్టీ క్యాడర్. అందుకే నవీన్ యాదవ్‌కే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.


  అభ్యర్థిని ఎంపిక చేసే క్రమంలో కాంగ్రెస్ సమీకరణాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అభ్యర్థి కోసం ఒక వ్యక్తిని పరిశీలించేటప్పుడు.. అతడి వ్యక్తిత్వం, చరిత్ర గురించి మాత్రమే పరిగణలోకి తీసుకోవట్లేదని విశ్లేషకులు అంటున్నారు. వాటితో పాటు అతడి వద్ద డబ్బులున్నాయా, అతడు లేదా ఆమె గెలుపు గుర్రాలేనా అనే ప్రాతిపదికపైనే.. అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు.


ఇందులో ఎంత నిజం ఉందో పక్కకు పెడితే.. రానున్న రోజుల్లో డబ్బు, పలుకుబడి ఎన్నికలను శాసిస్తాయని స్పష్టమవుతోంది. ప్రత్యర్థిని తట్టుకుని నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలంటే.. వారి కంటే బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాజకీయ పార్టీలు పోటీ పడితే.. సామాన్యుడికి రాజకీయ ప్రాతినిధ్యం అందని ద్రాక్షలా పరిణమిస్తుందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు, సోమవారం (అక్టోబర్ 6) కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్‌ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa