ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురి పెళ్లి కోసం భూమి అమ్మాలనుకున్నా..: ఎమ్మెల్యే మల్లారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:55 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా విధానాలు, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై బీఆర్‌ఎస్ శాసనసభ్యులు, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ.. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు రాజకీయ దిశానిర్దేశం చేశారు.


రేవంత్ రెడ్డి పాలనపై మల్లారెడ్డి విమర్శలు ..


ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన తీరు కరోనా మహమ్మారి సమయంలో ఉన్న పరిస్థితుల కంటే అధ్వాన్నంగా తయారైందని ఘాటుగా విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం కారణంగా రైతులు, యువత గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అయితే.. గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న మాదిరిగా మారిందని, ఎక్కడికక్కడ ఘోరాలు కనిపిస్తున్నాయని విమర్శించారు.


మల్లారెడ్డి ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించారు. నగరంలో ఒక్క ప్లాట్‌ కూడా అమ్మకం కావడం లేదు, అపార్ట్‌మెంట్‌లో ఒక గజం కూడా కదలడం లేదన్నారు. రైతు కుమార్తె వివాహం కోసం భూమి విక్రయించాలనుకున్నా.. కొనుగోలుదారులు లేరు.. అంటూ ఆయన రియల్ ఎస్టేట్‌ ఎంత ఘోరంగా పడిపోయిందో వివరించారు.


కరోనా కష్టకాలంలో కూడా వ్యాపారాలు నడిచాయని.. డబ్బు చలామణి జరిగిందని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో అసలు డబ్బు ఎక్కడా కనిపించడం లేదని... ఇది ఏదో మాయమైనట్టు లేదా మంత్రం చేసినట్టుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.


గతంలో హైదరాబాద్‌ను సింగపూర్, న్యూయార్క్ లాగా ప్రపంచమంతా చూసేదని.. ఎత్తైన భవనాలు అమ్ముడయ్యేవని, ఫైనాన్షియల్ సిటీగా రింగ్ రోడ్డు వెంబడి అభివృద్ధి చెందిందని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే బిల్డర్లు కష్టాల్లోకి వెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మోసాలను గమనించాలని మల్లారెడ్డి రాజకీయ పిలుపు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా.. ఓటుతోటే వారికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


తమ లక్ష్యం మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమేనని, పాత అభివృద్ధి రోజులు తిరిగి రావాలని.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంగా, టీమ్ వర్క్‌తో పనిచేయాలని.. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయని, ఇంటింటికి వెళ్లి ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. చివరిగా.. ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ అంటూ మల్లారెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa