అనుమతులు లేని లే ఔట్లలో రహదారులు, పార్కులు ఆక్రమణకు గురౌతున్నాయి. 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సిన రహదారులను ఇరువైపులా ఆక్రమణలు జరుగుతున్నాయి. డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. ఖాళీ చేయమంటే దాడి చేస్తున్నారంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొని సరైన రహదారులు, పార్కులు లేక ఇబ్బందులు పడొద్దని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు సూచించారు. హెచ్ ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లే ఔట్లలో ప్లాట్లు కొంటే రహదారులు, పార్కులు నిర్దేశిత లెక్కల ప్రకారం ఉంటాయన్నారు. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్రిచ్ ప్రాంతంలో సర్వే నంబరు 83లో వరకుంట చెరువు కబ్జాలను నివారించాలని.., బాచుపల్లి మండలంలోని నిజాంపేట సర్వే నంబరు 233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహార్నగర్ విలేజ్లో తన తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో అప్పట్లో ఇచ్చిన భూమిని స్థానికంగా ఉన్నవారు కబ్జా చేసేశారని అతని కుమారుడు ఫిర్యాదు చేశారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 41 ఫిర్యాదులందాయి. ఇందులో ఎక్కువగా రహదారులు, పార్కుల ఆక్రమణలే ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా... శేరిలింగంపల్లి మండలం మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి వాస్తవానికి 60 అడుగుల వెడల్పుతో ఉండగా.. కొంతమంది డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటుండగా.. అదే మార్గంలో కొంత దూరం వెళ్లాక ఏకంగా వసతి గృహాలను నిర్మించేశారని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని.. ఆ ప్రకారం గతంలో తొలగించగా.. ఇటీవల మళ్లీ వాటిని పెట్టి రోడ్డును కబ్జా చేసేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖాళీ చేయమంటే తమను బెదిరిస్తున్నారని.. లేని పక్షంలో రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ జిల్లా బూరంపేట గ్రామం సర్వే నంబరు 166/3 లోని ప్రభుత్వ భూమిలో దాదాపు కిలోమీటరు మేర 60 మీటర్ల వెడల్పులో రహదారి నిర్మించి పైన ఉన్న వెంచర్లకు దారి చూపుతున్నారని వెంటనే ఆక్రమణలను ఆపాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కిలోమీటర్ల మేర కబ్జా జరుగుతోందని వాపోతున్నారు.
రంగరెడ్డి జిల్లా హయత్నగర్ మండలం ఆదిత్యనగర్ - బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్డులు ఆక్రమణకు గురయ్యాయని.. పార్కు స్థలం కూడా కబ్జాకు గురైందని వెంటనే ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను కోరారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం సాయిప్రియానగర్లో 2500ల ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల పార్కు ఒకటి ఉండగా.. దానిని కూడా ప్లాట్లుగా చేసి విక్రయించేస్తున్నారంటూ సాయిప్రియా నగర్ నివాసితులు పిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa