హైదరాబాద్: అంబర్పేట్లోని డీడీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడికి అండగా నిలబడబోయిన ఓ బీటెక్ విద్యార్థిపై సుమారు 20 మంది యువకులు కర్రలు, బీరు సీసాలతో అతి కిరాతకంగా దాడి చేశారు. దుర్గామాత నిమజ్జనం అనంతరం అక్టోబర్ 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని అభినవ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఘటన వివరాల్లోకి వెళితే... డీడీ కాలనీలో అభినవ్ స్నేహితుడి ఇంటి వద్ద కొందరు యువకులు గొడవ పడుతూ దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అభినవ్, తన స్నేహితుడికి సహాయం చేయడానికి ఒంటరిగా అక్కడికి చేరుకున్నాడు. దీన్ని గమనించిన దాదాపు 20 మంది యువకుల గుంపు అభినవ్పై మూకుమ్మడిగా దాడికి తెగబడింది. కర్రలు, బీరు సీసాలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అభినవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడిపై అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు మూకుమ్మడిగా దాడికి పాల్పడటం వెనుక కారణాలు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన డీడీ కాలనీలో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. దుర్గామాత నిమజ్జనం వంటి పండుగ వాతావరణంలో ఇలాంటి అమానుష ఘటన జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు. స్నేహితుడికి అండగా నిలబడాలన్న సాయం చేయాలన్న ఉద్దేశంతో వెళ్లిన విద్యార్థిపై ఈ విధంగా దాడి జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడికి పాల్పడిన అందరినీ వెంటనే అరెస్టు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa