మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిట్టింగ్ మంత్రి కూతురే స్వయంగా ముఖ్యమంత్రిపై చేసిన 'గన్ కల్చర్' మరియు సెటిల్మెంట్ల ఆరోపణలపై ఆయన వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు సెటిల్మెంట్లో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలు, ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందనే అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బెదిరింపులకు గురైన సిమెంట్ కంపెనీ డైరెక్టర్ స్టేట్మెంట్ను పోలీసులు ప్రజల ముందు ఉంచాలని, నిందితుడికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, మంత్రి కారులో నిందితుడిని తీసుకెళ్లడం వంటి అంశాలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, డీజీపీ మౌనం వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కూతురే స్వయంగా ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చారని ఆరోపిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో 'గన్ కల్చర్' ఎక్కడి నుంచి వచ్చిందని, ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆమె నిలదీశారు. ఈ సెటిల్మెంట్ అంశంలో అసలు ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి, మిస్ వరల్డ్ పోటీల్లో అన్యాయం, మహిళా జర్నలిస్టులపై కేసులు, సభలో మహిళా ఎమ్మెల్యేల అవమానం, మాగంటి సునీతపై మంత్రుల అనుచిత వ్యాఖ్యలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అరాచక పాలన కొనసాగుతోందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. క్యాబినెట్ మంత్రి ఇంటిపైకి అర్థరాత్రి పోలీసులు వెళ్లడం, అయినా ఎఫ్ఐఆర్ లేకపోవడం, నిందితుడిని మంత్రి కారులో తీసుకెళ్లినా కేసు పెట్టకపోవడం వంటి అంశాలు చట్టవిరుద్ధ పాలనకు నిదర్శనమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ, బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారని, గన్ కల్చర్పై విచారణకు ఆదేశించకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఏం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గన్తో బెదిరించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కూతురే ఆరోపణలు చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీరు ప్రజలకు అర్థమవుతోందన్నారు. మంత్రి సీతక్క మేడారం పనులపై చేసిన వ్యాఖ్యలు, తన నియోజకవర్గంలోని మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల అంశాలపై స్పందించకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడంపై సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa