మేడారం మహాజాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. వచ్చే సంవత్సరం జరగబోయే మేడారం జాతరను పురస్కరించుకొని, భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి పనులు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈక్రమంలో మేడారంలో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.91 కోట్లకు పైగా నిధులను కేటాయించింది.
ఈ మొత్తంతో.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు మీదుగా స్థూపం వరకు ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలానే లోలెవల్ బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ వంతెనలు నిర్మింబోతున్నారు. ఈ పనులన్నీ మరో రెండు నెలల్లో అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మేడారం మహాజాతర సందర్భంగా కేవలం 4 రోజుల్లోనే కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. దీంతో మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్థూపం వరకు.. సుమారు 3 కిలోమీటర్ల వరకు రోడ్డు మీద భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్డు రెండు వరుసలుగా ఉండటం, మధ్యలో డివైడర్లు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో వీఐపీ వాహనాలు, అంబులెన్స్లు, పోలీసు వెహికల్స్ కూడా సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది.
ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే సంవత్సరం అనగా 2026 మహాజాతర నాటికి రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించి మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలానే భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని రోడ్డుకు ఇరువైపులా రెండు మీటర్ల వెడల్పుతో మురుగు కాలువలు కూడా నిర్మించనున్నారు. ఈ పనుల కోసం రూ.27.5 కోట్లు కేటాయించారు.
రోడ్లు భవనాల శాఖ.. మేడారం జాతర కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం కోసం రోడ్ల అభివృద్ధి చేపట్టింది. తాజాగా ప్రభుత్వం ఇందుకోసం రూ.91 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో రూ.12 కోట్లతో ఇల్లందు-పాకాల మధ్య ఉన్న రెండు లైన్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరించనున్నారు. అలానే తాడ్వాయి-నార్లాపూర్ మధ్య ఉన్న4 లోలెవల్ బ్రిడ్జిల స్థానంలో.. హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. భూపాలపల్లి-పస్రా రోడ్డుపై మొట్లగూడెం దగ్గర ఒక మైనర్ బ్రిడ్జిని, అలాగే అదే రోడ్డులో 22.810 కిలోమీటర్ల వద్ద ఉన్న లోలెవల్ కాజ్వేనుహైలెవల్ బ్రిడ్జిలుగా మార్చనున్నారు.
అలానే మేడారం సెంట్రల్ లైనింగ్ కోసం కూడా భారీగా నిధులు కేటాయిస్తూ.. రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే మేడారం వచ్చే అన్ని రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులన్నింటికీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa