ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లయినప్పటి నుంచే భార్య, అత్తామామల పోరు,,,అల్లుడు బలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 07:23 PM

ఒకప్పుడు భర్త, భర్త తల్లిదండ్రులు.. భార్యపై ఎక్కువగా గృహ హింసకు పాల్పడేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. భర్త, భర్త తల్లిదండ్రులపైనే.. భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారు. దీనికి తోడు వరకట్నం, గృహ హింస చట్టాల కింద తిరిగి భర్త, అత్తింటి వారిపైనే భార్య, ఆమె కుటుంబం కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దీంతో భర్త, అత్తింటి వారు కోర్టు చుట్టూ తిరుగుతూ.. జైళ్లలో మగ్గిపోతున్న సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా భార్య, అత్తింటి వారు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


భార్య కాపురానికి రాకపోవడం, అత్తమామల నుంచి నిత్యం వేధింపులు రావడంతో మనస్తాపం చెందిన అల్లుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32) అనే వ్యక్తికి.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన పూజతో సుమారు 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే.. పెళ్లి అయినప్పటి నుంచి హరిప్రసాద్‌ను వేరు కాపురం పెట్టాలని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్‌లు తీవ్రంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు.


ఈ విషయంపైనే హరిప్రసాద్, పూజ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే కూతురును తీసుకొని పూజ పుట్టింటికి వెళ్లిపోయేది. ఇటీవల నవంబర్ 2వ తేదీన భార్యా భర్తల మధ్య వివాదంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో హరిప్రసాద్‌ను అతని భార్య తరఫువారు తీవ్రంగా దుర్భాషలాడారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకో అంటూ అత్తింటి వారు తన కుమారుడిని తీవ్రంగా రెచ్చగొట్టారని మృతుడి తండ్రి మల్లేష్ ఆరోపించారు.


పంచాయితీలో జరిగిన అవమానం.. నిత్యం ఏదో ఒక రకంగా భార్య, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న వేధింపులను తట్టుకోలేకపోయిన హరిప్రసాద్.. ఈ నెల 18వ తేదీన వెల్దుర్తిలోని అత్తారింటి ముందు పురుగుల మందు తాగాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు.. వెంటనే అతడిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుమారు వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన హరిప్రసాద్ మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.


ఈ ఘటనపై బాధితుడి తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్‌లు మాత్రమే కాకుండా.. బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కూడా కారణమని పేర్కొంటూ పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కొడుకు ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa