ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించిన ప్రతిసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా మరో సారి ప్రెస్ మీట్ పెట్టిన కేఏ పాల్.. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందని, రూ. లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముతున్నారని ఆరోపించారు. అవి బినామీలకు అంటగడుతున్నారని అన్నారు. ఇది చాలకుండా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి.. డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. అమీర్పేట్లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కేఏ పాల్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి భట్టి విక్రమార్కకు రావాల్సిందని.. ఆ మేరకు రెడ్డి నేతలు అందరు కలిశారని కేఏ పాల్ చెప్పారు. అయితే తాను రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు చీలవద్దని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అభ్యర్థించారని పేర్కొన్నారు. అందుకే ప్రజా శాంతి పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చెయ్యలేదని చెప్పారు. ఎన్నికల ముందు మల్లు రవి చాలా సార్లు కాల్ చేశారని.. కానీ ఎన్నికల తరువాత మొఖం చాటేశారని ఆరోపించారు.
మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ..
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కేఏ పాల్ మండిపడ్డారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉండటానికి.. మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే భూములు మిగలడం లేదని.. భూములు అన్నీ అమ్మేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, బీసీ నాయకులందరినీ ఏకతాటి పైకి తీసుకొస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. డీపాజిట్ కూడా దక్కని అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీలో నిలిపిందన్నారు. ఇక బీహార్లో ఓటు చోరీ అని కాంగ్రెస్ పార్టీ అంటోందని.. మరి జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు చోరీ జరగలేదా అని నిలదీశారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో... రాష్ట్రంలోని సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతి పార్టీ ఆహ్వానం పలుకుతుందని కేఏ పాల్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa