తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. ఎక్కడికక్కడ సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలి గ్రామ పంచాయతీ ఫలితం దాదాపు తెలిసిపోయింది. ఓ గ్రామంలో రిజర్వేషన్ కేటగిరీ కుటుంబం ఒకటే ఉండటంతో.. ఆ కుటుంబంలోని వ్యక్తే సర్పంచ్ కానున్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో ఆ రిజర్వేషన్ కేటగిరీకి చెందిన ఒకే కుటుంబం ఉండటంతో జాక్పాట్ తగిలినట్లు అయింది. మంతన్ గౌడ్ గ్రామంలో ఎరుకలి భీమప్ప, అతడి భార్య వెంకటమ్మ చీపుర్లు, బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు. భీమప్పకు ఇద్దరు కుమారులు ఎల్లప్ప, మహేష్.. ఉన్నారు. వీరికి ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. వీరు నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
సర్పంచ్, రెండు వార్డులు..
భీమప్ప కుటుంబం నుంచే మంతన్ గౌడ్ తదుపరి సర్పంచ్ ఎన్నిక కానున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం.. ఈ గ్రామానికి ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ.. రెండు వార్డు రిజర్వేషన్లు వచ్చాయి. అంటే భీమప్ప కుటుంబం నుంచే ఆ ఇద్దరు వార్డు సభ్యులు ఎన్నిక కానున్నారు. రిజర్వేషన్ల విషయం తెలిసి భీమప్ప కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. గ్రామపంచాయతీ ఎన్నికలు వారి కుటుంబాన్ని మార్చబోతున్నాయని గ్రామంలో చర్చ నడుస్తోంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి భీమప్ప కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తామని అనుకున్నారో లేదో గానీ.. అదృష్టం మాత్రం వారి తలుపుతట్టింది. రాజకీయ నాయకుల కుటుంబం దిశగా మారే అవకాశాన్ని కల్పించింది. ఒక్కటే నామిషన్ దాఖలైతే.. మంతన్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
మంతన్ గౌడ్ లాంటి పరిస్థితే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం రాఘవాపురంలో నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 471 ఓట్లు ఉండగా.. ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉంది. ఆ ఫ్యామిలీలో తల్లి కాంపల్లి కోటమ్మ, కుమారుడు రమేశ్ మాత్రమే ఉన్నారు. అయితే సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే పంచాయతీ ఎన్నికలు జరగాలంటే.. ఆ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఉండాలి. కానీ ఈ గ్రామంలో ఇద్దరే ఉండటంతో.. సర్పంచ్గా కోటమ్మతో పాటు 4వ వార్డు (ఎస్సీ జనరల్ రిజర్వ్) సభ్యుడిగా రమేష్ ఏకగ్రీవం కానున్నారు.
కాగా, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాత.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి ప్రక్రియ ప్రారంభిస్తారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa