ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క’ అంటూ....సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 07:10 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "నిన్నటి వరకు ఒక లెక్క... రేపటి ' తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ' తర్వాత మరో లెక్క" అంటూ రాష్ట్ర భవిష్యత్తుపై తమ మహా సంకల్పాన్ని ప్రకటించారు.


తెలంగాణ ప్రజల ఓటుతో అధికారం చేపట్టిన తర్వాత తమ ప్రస్థానం జాతి కోసం.. జనహితం కోసం సాగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలన శిథిలాల కింద ఉన్న నవతరానికి తాము కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని.. అలాగే రుణభారంతో ఉన్న రైతులకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు.


ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి.. వారిని అదానీ, అంబానీల స్థాయిలో వ్యాపార రంగంలో నిలబెట్టామని తెలిపారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామని, వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని ఉద్ఘాటించారు. విద్య ఒక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి పునాదులు వేసినట్లు.. అలాగే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.


 సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల సంక్షేమంతో తాము సరిపెట్టలేదని.. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలనే దానిపై లోతైన మథనంతో 'విజన్-2047' మార్గదర్శక పత్రాన్ని సిద్ధం చేశామని తెలిపారు.


ఈ సందర్భంగా నిర్వహించబోతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ వేదికపై #TelanganaRising రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని.. భారత దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామని ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా.. సచివాలయాన్ని జాతీయ పతాక కాంతులతో అలంకరించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రగతి, గౌరవానికి ప్రతీకగా నిలిచింది. "మీ ఆశీర్వాదమే నా ఆయుధం" అంటూ సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల సహకారం ఉన్నంత వరకు 'TELANGANA RISING' కు తిరుగులేదని ప్రకటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa