ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 07:24 PM

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ప్రజల్లోని మూఢనమ్మకాలు మాత్రం వీడటం లేదు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో చోటుచేసుకున్న క్షుద్రపూజల ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఒక మాజీ సర్పంచ్ అభ్యర్థి అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ తాంత్రిక పూజలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో.. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.


గాల్లో నిమ్మకాయ, రక్త తర్పణాలు..


దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అభ్యర్థి నారపోగు నాగరాజు.. పగలు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ.. రాత్రి సమయాల్లో ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగరాజు ఒక మాంత్రికుడిని తీసుకొచ్చి ఈ క్షుద్ర పూజలు చేయిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పూజల్లో భాగంగా అన్నం రాసులపై జంతువుల మాంసం ఉంచి రక్త తర్పణాలు ఇస్తున్నట్లుగా గుర్తించారు.


ముఖ్యంగా.. తాంత్రిక విద్యలతో నిమ్మకాయను గాల్లో నిలబెడుతూ ప్రదర్శించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో గ్రామస్తుల్లో భయం పెరిగింది. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి.. వారిని భయపెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


నాగరాజుకు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించిన చరిత్ర ఉందని, క్రిమినల్ మెంటాలిటీ కలిగిన ఇతను డబ్బే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి మూఢనమ్మకాలు వ్యాపింపజేస్తున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో ఇటువంటి తాంత్రిక పూజలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, యువత డిమాండ్ చేస్తున్నారు. మూఢనమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్న మాజీ సర్పంచ్ నాగరాజుపై పోలీసులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


మారుమూల గిరిజన గ్రామాల్లో ఇలాంటి క్షుద్రపూజలు, నరబలులు వంటివి జరగకుండా ఉండేందుకు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని పలువురు నాయకులు, మేధావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సాంకేతిక యుగంలో కూడా ఇలాంటి అనాగరిక పనులు జరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa