ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్‌లైన్‌లో ఆహారంకి అలవాటుపడుతున్న యువత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:31 PM

దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనరేషన్-జెడ్ (జెన్-జెడ్) యువత ఇంటి భోజనానికి దూరమై, ఆన్‌లైన్‌లో లభించే ప్యాకేజ్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారని 'లోకల్ సర్కిల్స్' సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉండే ఆహారాన్నే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లు తేలింది.దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో 24 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఆహార పదార్థాల్లో 50 శాతానికి పైగా అల్ట్రా-ప్రాసెస్డ్, జంక్ ఫుడ్‌కు చెందినవే ఉంటున్నాయని సర్వే గుర్తించింది. ముఖ్యంగా బ్లింకిట్ (62 శాతం), జెప్టో (58 శాతం) వంటి యాప్‌లలో వీటి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో ఆహారం కొనుగోలు చేసే కుటుంబాల్లో 39 శాతం మంది.. తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని తెలిపారు. కేవలం 10-20 నిమిషాల్లోనే డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల వల్ల ఈ ధోరణి మరింత పెరిగింది.ఈ ఆహారపు అలవాట్ల వల్ల యువతలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa