రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' సోమవారం (డిసెంబర్ 8) అట్టహాసంగా ప్రారంభం అయింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైజింగ్ సమిట్ వేదికగా తెలంగాణలో భారీ పెట్టుబడులు ప్రకటించింది ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ. ఈ మేరకు ఈ కంపెనీ డైరెక్టర్ ఎరిక్.. వచ్చే పదేళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు తామము సిద్ధంగా ఉన్నామని ఎరిక్ వెల్లడించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పోరేషన్ లో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన డోనాల్డ్ ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్కు 52 శాతం వాటా ఉంది. ఈ ట్రస్ట్ కింద మరిన్ని కంపెనీలు ఉన్నాయి. ఫ్లోరిడా లోని సరసోటా కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తరచూ పోస్టులు చేసే ట్రూత్ సోషల్ను కూడా ఈ కంపెనీ నిర్వహిస్తోంది. కాగా, హైదరాబాద్లో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సిటీలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా పేరు పెట్టాలని చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రూ. 25 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్..
ఈ సదస్సులో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ కూడా భారీ ప్రకటన చేశారు. రూ. 25 వేల కోట్ల పెట్టుబడితో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 4 వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు 44 పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కంపెనీల నుంచి ప్రతినిధుల బృందాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. రెండు రోజుల సదస్సులో మొత్తం 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. అందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. సదస్సు నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణమంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. కాగా తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లుతో కూడిన బహుమతిని అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa