తెలంగాణలో ఇకపై ఏ సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ‘అఖండ-2’ సినిమా టికెట్ల పెంపు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వమని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. "హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి, ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదు. టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని అంగీకరించం" అని కోమటిరెడ్డి అన్నారు. సామాన్య కుటుంబం థియేటర్కు వెళ్లి సినిమా చూడాలంటే ధరలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి ‘అఖండ-2’ విషయంలో పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇది పునరావృతం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.అంతకుముందు, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే, ఈ తీర్పును సవాలు చేయగా, డివిజనల్ బెంచ్ నేడు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ‘అఖండ-2’ సినిమాకు పెంచిన టికెట్ ధరలు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా అమల్లో ఉండనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్ విధానంపై స్పష్టత ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa