పటాన్చెరు : పటాన్చెరు నియో జకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ల విభజన ప్రక్రియను జనాభా మరియు ఓటర్ల ప్రాతిపదికన చేపట్టాలని.. పటాన్చెరు కేంద్రంగా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ ని కలిసి నూతన డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందించారు. ఈ సందర్భంగా ప్రజలు, పుర ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన అభ్యంతరాలను, సలహాలను కమిషనర్ కు వివరించారు. ప్రధానంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో లక్ష 20 వేలకు పైగా ఓటర్లు, రెండు లక్షల జనాభా నివసిస్తుందని తెలిపారు. పాత అమీన్పూర్ మండలం, అమీన్పూర్ మున్సిపల్ కలిపి కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని.. పరిపాలన వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం కిష్టారెడ్డిపేట, బీరంగూడ, అమీన్పూర్, పిజిఆర్ కాలనీల పేరిట 30 వేల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో తెల్లాపూర్, ముత్తంగి డివిజన్లు ఏర్పాటు చేశారని.. వీటి పరిధిలో గల రెండు పడక గదుల ఇళ్ళ సముదాయాల ఓటర్లకు అనుగుణంగా నాలుగు డివిజన్లు అనగా తెల్లాపూర్, వెలిమల, కొల్లూరు, ముత్తంగి పేరుతో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు. తెల్లాపూర్ పరిధిలోని 450 గృహాలు ప్రస్తుతం భారతీ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నాయని.. వీటిని తిరిగి తెల్లాపూర్ డివిజన్లో కలపాలని కోరారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండే విధంగా పటాన్చెరు కేంద్రంగా జోనల్ కార్యాలయం సైతం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్.. అభ్యంతరాలను, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa