తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. ఫలితాలలో కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సర్పంచ్లుగా, మరో నలుగురు వార్డు మెంబర్లుగా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,230 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం..
పార్టీ మద్దతుదారులు విజయం సాధించిన స్థానాలు
కాంగ్రెస్ పార్టీ (Congress) 2,425 స్థానాలు
బీఆర్ఎస్ (BRS) 1,168 స్థానాలు
బీజేపీ (BJP) 189 స్థానాలు
స్వతంత్రులు 401 స్థానాలు
ఆదిలాబాద్ జిల్లాలో ఒకే కుటుంబం నుంచి ఏకంగా ముగ్గురు సర్పంచ్లు విజయం సాధించడం అరుదైన రాజకీయ పరిణామంగా చెప్పవచ్చు. ఈ విజయం సాధించిన వారంతా 1978లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అమర్ సింగ్ తిలావాత్ కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. వారి బలమైన రాజకీయ నేపథ్యం, స్థానిక సంబంధాలు ఈ విజయానికి దోహదపడ్డాయని తెలుస్తోంది.
జమునా నాయక్.. ఇంద్రవెల్లి మండలం, ధనోరా (బీ) పంచాయతీకి సర్పంచ్గా గెలుపొందారు. రోమా.. శంకర్ గూడ పంచాయతీకి జమునా నాయక్ తోడికోడలు అయిన రోమా సర్పంచ్గా విజయం సాధించారు. జాదవ్ లఖన్.. ఎమానుకుంట పంచాయతీలో జమునా నాయక్ చిన్నమామ కుమారుడు జాదవ్ లఖన్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.
అంతేకాకుండా.. ఈ కుటుంబానికి చెందిన జమునా నాయక్ కుమార్తె అనురాధ ధనోరా (బీ) 9వ వార్డులో, భర్త హీరాలాల్ శంకర్ గూడ 4వ వార్డులో విజయం సాధించారు. వీరితో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా వార్డు మెంబర్లుగా విజయం సాధించడం ద్వారా, ఒకే కుటుంబం ఏకంగా ఏడు పదవులను దక్కించుకోవడం రికార్డుగా నిలిచింది.
సాధారణంగా ఒక సర్పంచ్ పదవి కోసమే తీవ్రమైన పోటీ ఉంటుంది. అలాంటిది ఒకే కుటుంబం మూడు సర్పంచ్ పదవులతో పాటు.. పలు వార్డు మెంబర్ పదవులను గెలుచుకోవడం ద్వారా స్థానిక రాజకీయాలపై ఈ కుటుంబానికి ఉన్న బలమైన పట్టు, ప్రజాదరణ స్పష్టమవుతోంది. ఈ విజయం స్థానిక నాయకత్వానికి మరియు కుటుంబ రాజకీయ చరిత్రకు దక్కిన గౌరవంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa