ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు రూ.503 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 07:45 PM

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాక.. మద్దతు ధర, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. అలానే కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు విడుదల చేస్తూ.. రైతుల కళ్లలో సంతోషం నింపుతోంది. తాజాగా రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో రూ.503 కోట్లు జమ చేసింది.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలానికి సంబంధించి.. ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకుంది. ఈ జిల్లాలో మెట్ట ప్రాంతంలో వరి సాగు అధికంగా చేశారు. దీంతో ఈ జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి మొత్తం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈక్రమంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 42,199 మంది రైతుల నుండి రూ.589.93 కోట్ల విలువైన 2,46,934.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు అధికారులు.


ప్రభుత్వం కొనుగోలు చేసిన రైతుల్లో.. 39,857 మంది అన్నదాతలకు చెందిన 2,10,614.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం డబ్బులు రూ.503.16 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు అధికారులు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సంబంధించిన చెల్లింపుల్లో 85 శాతం పూర్తయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అకాల వర్షాలు కురిసి.. రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. వరి కోతలు కోసిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు.. ఈ అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ధాన్యాన్ని ఆరబెట్టడానికి చాలా కష్టపడ్డారు. తేమ శాతం పెరగడంతో.. తడిచిన ధాన్యాన్ని మళ్లీ కుప్పగా పోసి ఆరబెట్టడం కోసం కూలీలకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే, శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణం అనుకూలించి, ధాన్యం తూకాలు వేగంగా జరిగాయి.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 239 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 2,34,856.620 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం. మరో 12077.540 మెట్రిక్‌ టన్నులుసన్నాలు. కొనుగోలు చేసిన మొత్తంలో.. 2,43,000.860 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 3933.300 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa